సుశాంత్ సోదరి తాగొచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించింది: రియా సంచలన ఆరోపణ
- నా గదిలోకి వచ్చి అసభ్యంగా తడిమింది
- ఆ సమయంలో ఆమె పూటుగా తాగివుంది
- విషయం తెలుసుకుని చెల్లెలితో సుశాంత్ గొడవ
- ఆ తరువాతే తమ మధ్య దూరం పెరిగిందన్న రియా
ఏప్రిల్ 2019లోనే సుశాంత్ కుటుంబంలో తాను దుర్గుణాలను గమనించానని రియా ఈ ప్రకటనలో పేర్కొంది. ఒక రాత్రి, తాను సుశాంత్ ఇంట్లో ఉన్న వేళ, అతని చెల్లెలు పూటుగా తాగి గదిలోకి వచ్చిందని, ఆపై తనను అసభ్యంగా తడిమిందని సంచలన ఆరోపణలు చేసింది. ఆపై తాను షాక్ నకు గురై, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని గదమాయించానని, ఆమె వెళ్లిన తరువాత, తాను కూడా వెళ్లిపోయానని రియా పేర్కొంది.
ఆ తరువాత జరిగిన విషయాన్ని తాను సుశాంత్ కు చెప్పానని, ఈ విషయంలో వారిద్దరి మధ్యా పెద్ద వాగ్వాదమే జరిగిందని పేర్కొంది. ఈ ఘటన తరువాతనే తనకు, సుశాంత్ కుటుంబానికీ మధ్య చెడిందని వెల్లడించింది. కాగా, ఈ ఆరోపణలను సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఇది చాలా పాత ఘటనని, రియా మాటలు విని చెల్లితో గొడవ పడినందుకు సుశాంత్ క్షమాపణలు కూడా చెప్పారని అన్నారు.
ఇదిలావుండగా, ఆత్మహత్య చేసుకునేందుకు కొన్ని రోజుల ముందు సుశాంత్ సింగ్, తన కుటుంబాన్ని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించారని, వారికి ఫోన్ చేసి ఏడ్చారని రియా చెప్పుకొచ్చింది. కాగా, సుశాంత్ ఆత్మహత్య తరువాత ఈడీ నమోదు చేసిన కేసులో సుశాంత్ తండ్రి వాంగ్మూలాన్ని అధికారులు తాజాగా నమోదు చేశారు.