P Chidambaram: దుకాణం బంద్ చేసుకుందామా?: చిదంబరంకు షాకిచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి

Congress leader questions P Chidambaram

  • బీజేపీని ఓడించినందుకు ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానన్న చిదంబరం
  • ఆప్ ను అభినందించిన వైనం
  • ఆప్ గెలిస్తే కేరింతలు కొట్టాల్సిన అవసరం ఏముందన్న శర్మిష్ఠ ముఖర్జీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 స్థానాలను గెలుచుకోగా మిగిలిన చోట్ల బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆప్ గెలిచిందని... బుకాయింపుదారులు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించినందుకు ఢిల్లీ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో సెటిలైన ప్రజలు బీజేపీ ప్రమాదకర అజెండాను తిరస్కరించారని చెప్పారు. బీజేపీని ఓడించడం ద్వారా 2021, 2022 సంవత్సరాల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఢిల్లీ ప్రజలు ఒక సందేశాన్ని ఇచ్చారని అన్నారు.

చిదంబరం వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చిదంబరంకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. 'ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించే టాస్క్ ను కాంగ్రెస్ తీసుకుందా? అని మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా సార్. ఒకవేళ కాకపోతే... మన ఘోర పరాజయం గురించి ఆందోళన చెందకుండా.. ఆప్ విజయంపై మనం కేరింతలు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అవును అయితే... మనం దుకాణం మూసుకోవడం మంచిది' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

P Chidambaram
Congress
Sharmistha Mukherjee
AAP
Delhi Elections
  • Loading...

More Telugu News