ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి... కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
- అమీర్పేట మైత్రివనం వద్ద విగ్రహావిష్కరణ
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, నందమూరి కుటుంబ సభ్యులు, మంచు మనోజ్
- కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అన్న రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అన్నారు. అన్న ఎన్టీఆర్ లేకుంటే మీరు నాయకుడు అయ్యారా అని నిలదీశారు. అన్న నీడన బతికిన మీరు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. రామారావు పేరు పెట్టుకున్న నకిలీలు కూడా కూడా ఈరోజు నాయకుడిగా చెలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ అవకాశమిచ్చి, ప్రోత్సాహమిచ్చిన వారిలో తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మాధవరెడ్డి, జానారెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులుతో పాటు కేసీఆర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు రాజకీయ అవకాశం కల్పించిందే ఎన్టీఆర్ అన్నారు. ఈ చరిత్రను ఎవరూ మరువరాదని రేవంత్ రెడ్డి అన్నారు.