ట్విషా శర్మ మృతి కేసు: మాజీ జడ్జికి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ రద్దు
- కోడలి మృతి కేసులో మాజీ జడ్జి గిరిబాలా సింగ్కు ముందస్తు బెయిల్ రద్దు
- భోపాల్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
- ఆధారాలను కింది కోర్టు సరిగా పరిశీలించలేదన్న ధర్మాసనం
- గిరిబాలా సింగ్ అరెస్ట్కు సీబీఐకి మార్గం క్లియర్
- సీబీఐ కస్టడీలో ఆమె కుమారుడు సమర్థ్సింగ్
గిరిబాలా సింగ్ కోడలు ట్విషా శర్మ కట్నం వేధింపుల కారణంగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న గిరిబాలా సింగ్కు ఆమె వయసు, గత హోదాను దృష్టిలో ఉంచుకుని మే 15న భోపాల్ సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ దేవనారాయణ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
కేస్ డైరీ, సాక్షుల వాంగ్మూలాలు, వాట్సాప్ సంభాషణలు నిందితురాలి ప్రమేయాన్ని సూచిస్తున్నా, కింది కోర్టు వాటిని విస్మరించిందని హైకోర్టు పేర్కొంది. కట్నం చావులు సమాజానికి పెనుశాపమని, చట్టం ముందు అందరూ సమానమేనని, హోదా ఆధారంగా నేర తీవ్రతను తగ్గించలేమని స్పష్టం చేసింది.
తాజా తీర్పుతో గిరిబాలా సింగ్ను అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి మార్గం సుగమమైంది. ఆమెను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు, ట్విషా భర్త అయిన సమర్థ్ సింగ్ మే 29 వరకు సీబీఐ కస్టడీలో ఉన్నారు.