ఇంధన పొదుపు: ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహిస్తారా? కేంద్రానికి సీటీఐ ప్రతిపాదనలు
- ఇంధన ఆదా కోసం తప్పదన్న సీటీఐ
- కేంద్ర క్రీడాశాఖకు లేఖ
- ఆటగాళ్ల ప్రయాణం కోసం భారీ ఇంధనం
- ప్రేక్షకుల వాహనాలకూ పెట్రోల్ ఖర్చు
- అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఐపీఎల్ జట్లు నిరంతరం ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించడం వల్ల ఇంధన నిల్వలు భారీగా ఖర్చవుతున్నాయని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉపయోగించే బోయింగ్ 737, ఎయిర్బస్ ఏ320 చార్టర్డ్ విమానాలు గంటకు 2,400 నుంచి 3,000 లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను వినియోగిస్తాయని గుర్తుచేసింది.
ఒక్కో జట్టు ఈ సీజన్లో దాదాపు 10 విమాన ప్రయాణాలు చేస్తుందని, దీనివల్ల ఒక్కో ఫ్రాంచైజీ 50 వేల నుంచి 70 వేల లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తోందని బ్రిజేష్ గోయల్ లెక్కలతో వివరించారు. పైగా ఒక్కో మ్యాచ్ను చూడటానికి దాదాపు 50 వేల మంది వరకు ప్రేక్షకులు స్టేడియాలకు వస్తుంటారని గుర్తు చేశారు. వీళ్లు వాడే వాహనాల వల్ల రోజూ వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ వృథా అవుతోందని తెలిపారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో బయో-బబుల్ విధానంలో పరిమిత వేదికల్లో ఐపీఎల్ను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని సీటీఐ గుర్తు చేసింది.