పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత
- చెన్నైపై గెలిచినా పంజాబ్ కింగ్స్కు తప్పని జరిమానా
- స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు భారీ ఫైన్
- ఈ సీజన్లో అయ్యర్కు ఇది రెండో తప్పిదం
- అయ్యర్కు రూ. 24 లక్షలు.. జట్టు సభ్యులకు కూడా జరిమానా
చెన్నైతో మ్యాచ్ అనంతరం ఐపీఎల్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైంది. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం రెండో తప్పిదం కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. గతంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ అయ్యర్కు ఇదే కారణంతో రూ. 12 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఈసారి శిక్ష కేవలం కెప్టెన్కే పరిమితం కాలేదు. తుది జట్టులోని సభ్యులతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్కు కూడా జరిమానా విధించారు. జట్టులోని మిగతా ఆటగాళ్లందరికీ రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం.. ఏది తక్కువైతే అంతమేర కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో చెన్నైపై సాధించిన అద్భుత విజయం ఆనందం పంజాబ్ జట్టుకు పూర్తి స్థాయిలో దక్కకుండా పోయింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ విషయంలో మొదటిసారి తప్పు చేస్తే కెప్టెన్కు రూ. 12 లక్షలు, రెండోసారి రూ. 24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా ఇదే తప్పిదం పునరావృతమైతే కెప్టెన్కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్లలో పంజాబ్ కింగ్స్, ముఖ్యంగా కెప్టెన్ అయ్యర్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.