ఉద్యోగం పోయిందంటూ ఉదయాన్నే మెయిల్... ఒరాకిల్ ఉద్యోగుల ఆవేదన
- ఉదయాన్నే ఈ-మెయిల్ ద్వారా షాక్ ఇచ్చిన ఒరాకిల్
- ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందిని తొలగించినట్టు ప్రచారం
- సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకుంటున్న ఉద్యోగులు
- భారత్లో 12 వేల మందిపై వేటు పడినట్టు అంచనా
- సంఖ్యపై అధికారికంగా స్పందించని ఒరాకిల్ యాజమాన్యం
ఈ ఊహించని పరిణామంతో షాక్కు గురైన అనేక మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు. "ఏడాది క్రితమే కంపెనీలో చేరాను. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు ఉదయాన్నే మెయిల్ వచ్చింది" అని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రూ. 6 లక్షల పరిహారంతో పాటు, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీ ఇచ్చినట్టు తెలిపారు. మరో ఉద్యోగి మాట్లాడుతూ, ఈ ఆకస్మిక నిర్ణయంతో తన దినచర్య, స్థిరత్వం దెబ్బతిన్నాయని, మానసికంగా చాలా కష్టంగా ఉందని వాపోయారు.
అందిన నివేదికల ప్రకారం, ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 18 శాతం. ఒక్క భారత్లోనే 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్, క్లౌడ్ ఆపరేషన్స్, సేల్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ఈ కోతలు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, తొలగించిన ఉద్యోగుల కచ్చితమైన సంఖ్య, పరిహార ప్యాకేజీల వివరాలపై ఒరాకిల్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.