క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్కు ఇరాన్ వింత హెచ్చరిక
- స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యల ప్రస్తావన
- యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాల గొంతుకను వినిపించే ప్రయత్నం
- అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఇరాన్ చర్య
ఇటీవల స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, గాజా, లెబనాన్లలో హింసను ఆపాలని, ఐరోపా దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలనే ఇరాన్ తమ వ్యూహాంలో భాగంగా ఉపయోగించుకుంది. క్షిపణులపై శాంచెజ్ పేరుతో సహా ఆయన మాటలు రాసిన స్టిక్కర్ ను అంటించి ప్రయోగించింది.
కేవలం సైనిక దాడికే పరిమితం కాకుండా, ఇజ్రాయెల్ వైఖరిని వ్యతిరేకిస్తున్న అంతర్జాతీయ నేతల గొంతుకను వారికి వినిపించడమే ఇరాన్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఆయుధాల ద్వారానే శాంతి సందేశాన్ని పంపడం ఒకరకమైన దౌత్యపరమైన వ్యంగ్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తన దాడులను ఆపకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయని పరోక్షంగా హెచ్చరించడమే దీని వెనుక ఉన్న అంతరార్థం. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, మరోవైపు క్షిపణి దాడులు ఆగకపోవడంతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది.