మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్తో రూ.1.2 కోట్లు స్వాహా!
- దొడ్ల డెయిరీతో సహా దాదాపు 18 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న దివ్యారెడ్డి
- వాట్సాప్లో ఆమె ఫొటో, పేరు ఉపయోగించి కేటుగాళ్ల వల
- నిజమేనని నమ్మిన అకౌంటెంట్.. రూ.1.2 కోట్లు బదిలీ
- రెండోసారి డబ్బు అడగడంతో బయటపడిన బాగోతం
- సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు
దొడ్ల-ప్రతాప్ గ్రూప్లో డైరెక్టర్గా, దొడ్ల డెయిరీతో సహా దాదాపు 18 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న దివ్యారెడ్డికి తెలియకుండా ఈ మోసం జరిగింది. వివరాల్లోకి వెళితే, మార్చి 13న కంపెనీ అకౌంటెంట్ గుండెమెడ రఘుబాబుకు ఓ అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లో దివ్యారెడ్డి ఫొటో, పేరు ఉండటంతో అది ఆమె నుంచే వచ్చిందని ఆయన పూర్తిగా విశ్వసించారు. "తాను ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, తక్షణం కొంత డబ్బు బదిలీ చేయాలి" అని ఆ సందేశంలో ఉండటంతో, రఘుబాబు ఏమాత్రం ఆలోచించకుండా కంపెనీ ఖాతా నుంచి రూ.1.2 కోట్లను నేరగాళ్లు సూచించిన 'లేబోరిస్ ఇంటీరియర్స్' అనే సంస్థ పేరుతో ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేశారు.
ఈ మోసం ఇంతటితో ఆగలేదు. మార్చి 17న అదే నంబర్ నుంచి మరోసారి సందేశం వచ్చింది. ఈసారి 'ఆర్మ్ ప్లేబోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్' అనే ఖాతాకు రూ.18 లక్షలు బదిలీ చేయాలని కోరారు. నిర్ధారణ కోసం రఘుబాబు ఆ సందేశాన్ని దివ్యారెడ్డికి ఫార్వార్డ్ చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. తాను ఎలాంటి మెసేజ్లు పంపలేదని దివ్యారెడ్డి చెప్పడంతో అకౌంటెంట్ షాక్కు గురయ్యారు. జరిగిన మోసాన్ని గ్రహించి వెంటనే అప్రమత్తమయ్యారు.
బాధితురాలు దివ్యారెడ్డి వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి, ఆ తర్వాత సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ ఆధారాలను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉన్నతస్థాయి వ్యక్తుల పేర్లతో జరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బు బదిలీలకు ముందు ఫోన్ ద్వారా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.