ప్రజాపోరాటాలు విజయం సాధిస్తాయని దీని ద్వారా నిరూపితమైంది: కవిత
- వెలుగుమట్లలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్న కవిత
- తమ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చిందన్న కవిత
- అయితే ప్రతి బాధితుడికి న్యాయం చేయాలని కవిత డిమాండ్
ఇళ్లు కోల్పోయిన వారిలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజా పోరాటాలు తప్పక విజయం సాధిస్తాయనే విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. 750 మంది ఇళ్లు కూల్చివేసి కేవలం 411 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మిగిలిన వారిలో తమకు అన్యాయం జరిగిందనే భావన నెలకొందని అన్నారు.
పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం తాము నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు భాగస్వాములు అయ్యారని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని కవిత అన్నారు. ఈ నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, అధికారులు పూర్తిగా సహకరించాలని ఆమె డిమాండ్ చేశారు.