ప్రపంచ హాకీ క్వాలిఫయర్స్ ఫైనల్లో భారత్కు నిరాశ.. ఇంగ్లండ్ విజయం
- ఇంగ్లండ్ చేతిలో 0-2 తేడాతో ఓడిన భారత మహిళల జట్టు
- హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఫైనల్
- రజతంతో సరిపెట్టుకున్న భారత జట్టు
ఆట ఆరంభంలో భారత్ దూకుడుగా ఆడింది. తొలి రెండు నిమిషాల్లోనే లభించిన పెనాల్టీ కార్నర్ను నవనీత్ కౌర్ గోల్గా మలచడంలో విఫలమైంది. క్రమంగా పుంజుకున్న ఇంగ్లండ్ తొలి క్వార్టర్ ముగియడానికి ముందు లభించిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకుంది. గ్రేస్ బాల్స్డన్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ప్రథమార్ధం ముగిసేసరికి స్కోరులో మార్పు రాలేదు.
మూడో క్వార్టర్లో ఇంగ్లండ్ ఆటపై పట్టు సాధించింది. 43వ నిమిషంలో మిడ్ఫీల్డర్ ఎలిజబెత్ నీల్ కొట్టిన బంతి భారత డిఫెండర్కు తగిలి గోల్పోస్ట్లోకి వెళ్లడంతో ఇంగ్లండ్ ఆధిక్యం 2-0కి పెరిగింది. చివరి క్వార్టర్లో గోల్ కోసం భారత్ ఎంతగానో ప్రయత్నించింది. చివరి నిమిషాల్లో ఒక పెనాల్టీ కార్నర్ లభించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ గెలుచుకోగా, భారత్ రన్నరప్గా నిలిచింది.