బీసీసీఐలో ఇక పదవులు చేపట్టవచ్చు... అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
- దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీంకోర్టు
- లోధా కమిటీ సిఫార్సుల వివాదంలో 2017లో ఠాకూర్ పై వేటు
- ఇది జీవితకాల నిషేధం కాదని స్పష్టం చేసిన న్యాయస్థానం
- బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనేందుకు ఠాకూర్కు తాజాగా అనుమతి
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. విధించిన నిషేధం జీవితకాలం కొనసాగేది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. దాదాపు 9 ఏళ్లుగా నిషేధం కొనసాగుతోందని, ఈ విషయంలో ఠాకూర్ ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా తీర్పుతో, బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు అంతర్గత, పరిపాలనా వ్యవహారాల్లో పాల్గొనేందుకు ఠాకూర్కు మార్గం సుగమమైంది.
భారత క్రికెట్ కు సంబంధించి, జస్టిస్ ఆర్.ఎం. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి నిరాకరించారన్న కారణంతో 2017 జనవరి 2న అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్పై సుప్రీంకోర్టు వేటు వేసింది. కోర్టు ఆదేశించిన సంస్కరణల అమలులో బీసీసీఐ నాయకత్వం మొండిగా వ్యవహరించిందని అప్పటి సీజేఐ జస్టిస్ టీ.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఠాకూర్తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కేను కూడా తొలగించి, బీసీసీఐ పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.