సింగపూర్ లో అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. భారత మహిళ వ్యాఖ్య
- ఎలాంటి భయాందోళన లేదని వెల్లడి
- ఇదే భారతదేశంలో అయితే వణికిపోయేదాన్నని వ్యాఖ్య
- వైరల్ గా మారిన వీడియో.. మహిళల భద్రతపై నెట్టింట చర్చ
ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియోలోని వివరాల ప్రకారం.. కృతికా జైన్ అనే భారత మహిళ కొంతకాలంగా సింగపూర్ లో ఉంటున్నారు. ఇటీవల ఆఫీసులో తన విధులు పూర్తిచేసుకుని తెల్లవారుజామున 3 గంటలకు ఒంటరిగా ఇంటికి బయలుదేరారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళుతున్నానని కృతికా జైన్ చెప్పారు. ఇదే సమయంలో భారతదేశంలో తాను ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా భయపడేదానినని అన్నారు.
సింగపూర్ లోని పర్యాటక ప్రాంతాలకన్నా అర్ధరాత్రి మహిళలు కూడా నిర్భయంగా బయటకు వెళ్లగలిగే అవకాశం ఉండటమే తనకు బాగా నచ్చిన విషయమని తెలిపారు. భారత్ లో లాగా భద్రత అనేది సింగపూర్ లో లగ్జరీ కాదని, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే నిత్యావసరం లాంటిదని పేర్కొన్నారు. ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. భారత్, సింగపూర్ లలో మహిళల భద్రతపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.