న్యూ ఇయర్ వేళ డెలివరీ సెగ: నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఫుడ్, కిరాణా ఆర్డర్లకు బ్రేక్!
- జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి ప్రముఖ ప్లాట్ఫారమ్ల డెలివరీ భాగస్వాముల నిరసన
- ఆదాయం పడిపోవడం, పనిభారం పెరగడంపై గిగ్ వర్కర్ల అసహనం
- హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలకు ఆటంకం
- వేలాది మంది వర్కర్లు యాప్ల నుంచి లాగ్-ఆఫ్ కావాలని పిలుపు
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సంస్థలు చెల్లించే పారితోషికం (పే అవుట్స్) దారుణంగా పడిపోవడం, పని గంటలు విపరీతంగా పెరగడం, కనీస సామాజిక భద్రత లేకపోవడమే ఈ నిరసనకు ప్రధాన కారణమని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడం, కంపెనీలు విధిస్తున్న భారీ జరిమానాలు తమను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా డిసెంబర్ 31న ఫుడ్, గ్రాసరీ డెలివరీలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే డెలివరీ బాయ్స్ సామూహికంగా యాప్ల నుంచి లాగ్-ఆఫ్ అవ్వడం వల్ల హైదరాబాద్, బెంగళూరు, పూణె, ఢిల్లీ వంటి నగరాల్లో ఆర్డర్లు క్యాన్సిల్ అవ్వడం లేదా డెలివరీ సమయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. తమ నిరసన కస్టమర్లను ఇబ్బంది పెట్టడానికి కాదని, తమ సమస్యల పట్ల ప్రభుత్వం, కంపెనీలు స్పందించేలా చూడటమే తమ లక్ష్యమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.