ఆపరేషన్ సిందూర్ తో తీవ్రంగా భయపడిన పాక్... అందుకు ఇదే నిదర్శనం!
- 'ఆపరేషన్ సింధూర్' వేళ బంకర్లోకి వెళ్లమన్నారని అంగీకరించిన పాక్ అధ్యక్షుడు జర్దారీ
- పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య
- ఆపరేషన్ సమయంలో పాక్ అగ్రనాయకత్వంలో తీవ్ర భయాందోళన
ఇటీవల ఓ బహిరంగ సభలో జర్దారీ మాట్లాడుతూ, "నా మిలటరీ సెక్రటరీ నా వద్దకు వచ్చి, 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ దాడులు చేస్తోంది, యుద్ధం ప్రారంభమైంది, మనం బంకర్లోకి వెళదాం' అని సూచించాడు" అని తెలిపారు. అయితే, తాను ఆ సూచనను తిరస్కరించానని, "నాయకులు యుద్ధభూమిలోనే ప్రాణాలు విడుస్తారు కానీ, బంకర్లలో కూర్చుని చనిపోరు" అని ధీమాగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణులతో విరుచుకుపడింది. కనీవినీ ఎరుగని రీతిలో భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
భారత్ దాడుల తీవ్రతకు పాక్ అధ్యక్ష భవనం సైతం వణికిపోయిందనడానికి జర్దారీ వ్యాఖ్యలే నిదర్శనం. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరి పాకిస్థాన్ను ఏ స్థాయిలో కలవరానికి గురిచేసిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.