పీపీపీకి వ్యతిరేకంగా పోరు.. నేడు గవర్నర్కు కోటి సంతకాలు సమర్పించనున్న జగన్
- మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ
- ప్రజల నుంచి కోటికి పైగా సంతకాలను సేకరించిన పార్టీ
- పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాలని వినతి
ఈరోజు సాయంత్రం 4 గంటలకు జగన్ రాజ్భవన్లో గవర్నర్తో సమావేశం కానున్నారు. అంతకు ముందు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను ఆయన జెండా ఊపి లాంఛనంగా పంపిస్తారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.
జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంతో తాము అధికారంలో ఉండగా వాటిని మంజూరు చేశామని వైసీపీ చెబుతోంది. అయితే, నిధుల కొరత, సమర్థ నిర్వహణ పేరుతో కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందని ఆరోపిస్తోంది. దీనివల్ల పేదలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్యం దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీని సందర్శించిన జగన్, అక్కడి నుంచే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమ శంఖారావం పూరించారు. అప్పటి నుంచి గ్రామాల్లో రచ్చబండ, మండల కేంద్రాల్లో నిరసనలు, యువతతో బైక్ ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలతో పాటు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఇవాళ గవర్నర్ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు.