కేరళ నటి కేసు: బాధితురాలికి మద్దతుగా నిలిచిన పృథ్వీరాజ్
- కేరళ నటి కేసులో ఆరుగురు దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష
- 8 ఏళ్ల ప్రయాణం తర్వాత ఉపశమనం కలిగిందన్న బాధితురాలు
- నిందితుడు తన పర్సనల్ డ్రైవర్ కాదంటూ స్పష్టతనిచ్చిన నటి
ఈ తీర్పుపై నటి మంజు వారియర్ కూడా స్పందిస్తూ, బాధితురాలికి పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. "నేరం చేసిన వారికి శిక్ష పడింది. కానీ, ఈ దారుణానికి ప్లాన్ చేసిన అసలు వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది భయంకరమైన విషయం. ఈ నేరం వెనుక ఉన్న వారందరికీ శిక్ష పడినప్పుడే పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది" అని ఆమె అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన నటుడు దిలీప్కు మంజు వారియర్ మాజీ భార్య అన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బాధిత నటి కొన్ని వదంతులపై స్పష్టత ఇచ్చారు. ప్రధాన నిందితుడు తన పర్సనల్ డ్రైవర్ కాదని, తాను పనిచేసిన ఓ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన డ్రైవర్ అని తెలిపారు. ఘటనకు ముందు అతడిని ఒకటి రెండుసార్లు మాత్రమే చూశానని, అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. "ఈ తీర్పు నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. 2020లోనే ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతోందని నాకు అనిపించింది. ట్రయల్ కోర్టుపై నమ్మకం లేదని హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా నా విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ ప్రయాణంలో చట్టం ముందు అందరూ సమానులు కారని అర్థమైంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.