మరో 3 గంటల్లో చనిపోతావన్నారు.. ఇప్పుడు వీడియో గేమ్స్తో వందల కోట్లు సంపాదిస్తున్నాడు!
- ప్రాణాంతక వ్యాధి నుంచి వీడియో గేమ్స్తో ఊరట పొందిన జెంగ్హువా
- సెరనిటీ ఫోర్జ్ పేరుతో గేమింగ్ స్టూడియో ప్రారంభం
- ఏడాదికి రూ.125 కోట్ల వరకు ఆదాయం ఆర్జిస్తున్న కంపెనీ
ఆ గండం నుంచి బయటపడినప్పటికీ, దాదాపు రెండేళ్లపాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో 'లీగ్ ఆఫ్ లెజెండ్స్', 'మైన్క్రాఫ్ట్' వంటి వీడియో గేమ్స్ అతనికి మానసిక ధైర్యాన్ని, ఊరటను ఇచ్చాయి. అప్పుడే ఆయనకో ఆలోచన వచ్చింది. "కేవలం వినోదం కోసమే తయారుచేసిన ఈ గేమ్స్ నా ప్రాణాలను కాపాడాయి. అలాంటప్పుడు, ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో గేమ్స్ తయారు చేస్తే ఎంత శక్తిమంతంగా ఉంటుంది?" అని యాంగ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
ఆ ఆలోచనతోనే కేవలం 1,000 డాలర్ల (సుమారు రూ.83,000) పెట్టుబడితో 'సెరనిటీ ఫోర్జ్' అనే గేమింగ్ స్టూడియోను ప్రారంభించారు. దశాబ్దం తర్వాత, ఈ సంస్థ 'డోకి డోకి లిటరేచర్ క్లబ్' వంటి విజయవంతమైన గేమ్స్ సహా 70కి పైగా టైటిల్స్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక ఆదాయం 10 నుంచి 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల నుంచి రూ.125 కోట్లు) మధ్య ఉంది.
అయితే, డబ్బు సంపాదించడం కంటే తన గేమ్స్ ప్రజలపై చూపే ప్రభావమే తనకు ముఖ్యమని యాంగ్ చెబుతారు. "మా కంపెనీ ఆశయాలకు సరిపోదని భావించి, సుమారు 20 మిలియన్ డాలర్లు (రూ.166 కోట్లు) ఆర్జించి పెట్టే ప్రాజెక్టును కూడా తిరస్కరించాం. నా దగ్గరకు వచ్చిన ఎందరో యువకులు, 'మీ గేమ్ వల్లే నేను ఓ హింసాత్మక సంబంధం నుంచి బయటపడ్డాను, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను' అని కన్నీళ్లతో చెబుతుంటారు. డబ్బు, ఉద్యోగుల సంఖ్య కంటే ఇలాంటి మాటలే నాకు ఎక్కువ స్ఫూర్తినిస్తాయి" అని ఆయన వివరించారు. వ్యాపార రంగంలోకి వచ్చేవారు వైఫల్యాలను తరచుగా, వేగంగా ఎదుర్కోవాలని, వాటి నుంచే పాఠాలు నేర్చుకోవాలని యాంగ్ సూచిస్తున్నారు.