వారసత్వంతోనో, పెళ్లితోనో కాదు... నా స్వశక్తితోనే గుర్తింపు తెచ్చుకున్నా: ఉపాసన కొణిదెల
- ఖాస్ ఆద్మీ పార్టీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఉపాసన స్ఫూర్తిదాయక పోస్ట్
- డబ్బు, కీర్తి కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని స్పష్టం
- కష్టాలను ఎదుర్కొని ఎదగడమే తనను ప్రత్యేకంగా నిలబెట్టిందని వెల్లడి
- మహిళలను తక్కువ చేసి చూడొద్దని సమాజానికి హితవు
డబ్బు, హోదా, విజయం, కీర్తి వంటివి ఒక వ్యక్తిని గొప్పవారిని చేస్తాయా? లేక వారిలోని అంతర్గత లక్షణాలైన భావోద్వేగ స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం వంటివి గొప్పవారిని చేస్తాయా? అని ఉపాసన తన పోస్టులో ప్రశ్నించారు. సమాజం తరచుగా బాహ్య విజయాలకే విలువ ఇస్తుందని, ముఖ్యంగా మహిళలను నిరాడంబరంగా ఉండాలని, తమ వంతు వచ్చేవరకు ఎదురుచూడాలని చెబుతుందని, కానీ పెద్ద కలలు కనడాన్ని మాత్రం సమాజం ప్రోత్సహించదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"నేను వారసత్వం లేదా పెళ్లి కారణంగా ప్రత్యేక వ్యక్తిని కాలేదు. ఒత్తిడిని, బాధను తట్టుకుని ఎదగడాన్ని ఎంచుకున్నాను. ఎన్నోసార్లు కిందపడ్డాను, మళ్లీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నాపై నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను" అని ఆమె తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంటుందని, దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదని ఆమె అన్నారు. "అహంకారం గుర్తింపును కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం నిశ్శబ్దంగా గుర్తింపును సృష్టిస్తుంది" అని ఆమె వివరించారు.
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలైన ఉపాసన, ప్రస్తుతం అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2012లో ఆమెకు రామ్ చరణ్తో వివాహం కాగా, ఈ దంపతులకు 2023లో క్లీంకార అనే కుమార్తె జన్మించింది.