పీఎస్సార్ ఆంజనేయులు జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకి మరోసారి అస్వస్థత
- బీపీ హెచ్చుతగ్గులతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
- ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న ఆంజనేయులు
పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో రెండు రోజుల క్రితమే హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా, నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చేసుకున్న విజ్ఞప్తి మేరకు, వైద్య చికిత్స నిమిత్తం న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, పోలీసులు వంశీని విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన రెండు మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతారని, ఆ తర్వాత తిరిగి జిల్లా జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.