Google: ఆండ్రాయిడ్ టీవీల్లో ఇక గూగుల్ గుత్తాధిపత్యానికి తెర!

- స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఓఎస్ ను డిఫాల్ట్గా ఉంచడంపై గూగుల్కు సీసీఐ ఆదేశాలు
- పోటీ వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తోందని సీసీఐ నిర్ధారణ
- టీవీ తయారీ కంపెనీలు ఇతర ఓఎస్లను వాడుకునేందుకు స్వేచ్ఛ
- ప్లే స్టోర్, గూగుల్ సర్వీసుల లైసెన్స్కు ఇకపై రుసుము ఉండే అవకాశం
భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్లో గూగుల్ అనుసరిస్తున్న విధానాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్), అలాగే గూగుల్ ప్లే స్టోర్ను డిఫాల్ట్గా అందించడాన్ని ఇకపై కొనసాగించబోమని గూగుల్ అంగీకరించింది. సీసీఐ ఆదేశాల నేపథ్యంలో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది.
భారత స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 'పోటీ వ్యతిరేక పద్ధతులు' అవలంబిస్తోందని, మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్కు భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక్కడ స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (TADA) కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్, ఇతర అప్లికేషన్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన 'ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం' చేస్తోందని సీసీఐ తన దర్యాప్తులో గుర్తించింది.
ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు గూగుల్, ఆల్ఫాబెట్పై ఫిర్యాదు చేయడంతో సీసీఐ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్రత్యామ్నాయ లేదా సవరించిన ఆపరేటింగ్ సిస్టమ్లను అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు గూగుల్ అవలంబిస్తున్న పద్ధతులు అడ్డంకిగా మారుతున్నాయని తేలింది.
సెటిల్మెంట్కు గూగుల్ అంగీకారం.. మార్పులు ఇవే!
సీసీఐ ఆదేశాల మేరకు, గూగుల్ ఒక సెటిల్మెంట్ అప్లికేషన్ను దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం, భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా, విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఉచితంగా ప్రి-ఇన్స్టాలేషన్ కోసం అందించిన గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంతేకాకుండా, భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే తమ భాగస్వాములందరికీ ఒక లేఖ పంపాలని గూగుల్ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ను ఉపయోగించాల్సిన అవసరం లేదని, తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడుకునే స్వేచ్ఛ వారికి ఉందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.
వినియోగదారులపై ప్రభావం
ఈ మార్పుల వల్ల వినియోగదారులపై ప్రభావం పడనుంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు, తాము ఎంచుకున్న మోడల్లో అవి ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయా లేదా అని రిటైలర్లు, బ్రాండ్లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లు, యాప్ స్టోర్లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.
డేటా భద్రత, సులభమైన వినియోగం (యూజర్ ఇంటర్ఫేస్) పరంగా యాపిల్ ఐఓఎస్, గూగుల్ ఆండ్రాయిడ్, అమెజాన్ ఫైర్ ఓఎస్ వంటివి ప్రజాదరణ పొందాయి. కాబట్టి, టీవీ కొనుగోలుదారులు ఇకపై ఆపరేటింగ్ సిస్టమ్, యాప్ స్టోర్ గురించి కొంత పరిశోధన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైసెన్స్, సోనీ, పానాసోనిక్, ఫిలిప్స్, షార్ప్, మోటరోలా, నోకియా, తోషిబా, టీసీఎల్ వంటి బ్రాండ్లు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్ సేవలనే ఎక్కువగా వినియోగిస్తున్నాయి.
టీవీ తయారీదారులకు అవకాశాలు
ఈ కొత్త ఒప్పందం ప్రకారం, భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్లను డిఫాల్ట్గా ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతానికి ఈ ఒప్పందం ప్రధానంగా స్మార్ట్ టీవీలకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.