Anant Ambani: జామ్నగర్ నుంచి ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ.. 140 కిలోమీటర్ల పాదయాత్ర

- భారీ భద్రత మధ్య రాత్రివేళ నడక సాగిస్తున్న అనంత్ అంబానీ
- ఏప్రిల్ 10న తన బర్త్డే నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్న అనంత్
- ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడి
ఆసియా కుబేరుడు, బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకకు కాలినడకన వెళ్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్లకు పైనే. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడొద్దనే ఉద్దేశంతో భారీ భద్రత మధ్య రాత్రివేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టిన రోజు నాటికి అనంత్ ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మంగళవారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడారు. జామ్నగర్లోని తమ ఇంటి నుంచి ద్వారక వరకు ప్రారంభమైన పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోందని అనంత్ అంబానీ తెలిపారు. మరో నాలుగు రోజుల్లో ద్వారకకు చేరుకుంటామన్నారు. ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. యువత ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచాలన్నారు. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని చెప్పారు. అప్పుడు ఆ పని కచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని తెలిపారు. దేవుడు ఉన్నప్పుడు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత్ అంబానీ ఏఎన్ఐతో అన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్లో అనంత్ అంబానీ బాధ్యతలివే...
అనంత్ అంబానీ 2020 మార్చి నుంచి జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, 2022 మే నుంచి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, 2021 జూన్ నుంచి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ మరియు రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 29 ఏళ్ల అనంత్ అంబానీ 2022 సెప్టెంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా పనిచేస్తున్నారు. ఇక గతేడాది జులై 12న మహారాష్ట్రలోని ముంబయిలో రాధికా మర్చంట్ను వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే.