lalitha jewellers: గుండు తుడిచేందుకు ప్రత్యేకంగా ఓ మనిషి.. లలితా జ్యువెలర్స్ అధినేత వీడియో వైరల్

--
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు..’ అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. లలితా జ్యువెలర్స్ వారి ప్రకటనలో కనిపించే గుండు బాస్ (కిరణ్ కుమార్) ఈ ఒక్క డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు. మిగతా జ్యువెలర్స్ మాదిరి కాకుండా తన దుకాణానికి సంబంధించిన యాడ్ లో తనే నటించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ఈ గుండు బాస్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు కానీ, ఓ ఫంక్షన్ కు హాజరైన కిరణ్ కుమార్ ఓ వ్యక్తితో మాట్లాడుతుండడం ఈ వీడియోలో కనిపించింది. వెనక ఉన్న వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కిరణ్ కుమార్ గుండుపై పట్టిన చెమటను ఎప్పటికప్పుడు చిన్న టవల్ తో తుడవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కిరణ్ కుమార్ గుండు తుడవడమే తన పని అన్నట్లు ఆ సిబ్బంది వ్యవహరించారు.
నాని అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘జీవితంలో ఎంత సంపాదించాలంటే.. ఇదిగో ఇలా గుండుకు పట్టిన చెమటను తుడిచేందుకు ఓ ఉద్యోగిని పెట్టుకునేంతగా’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ క్యాప్షన్ కు తోడు గుండు బాస్ చెమట తుడుస్తున్న దృశ్యాలను చూసి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. ఈ వీడియోకు చాలా మంది నవ్వుతున్న ఎమోజీలతో, మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదీ అన్నా లైఫ్ అంటే..’ అని ఒకరు, ఆ ఉద్యోగం నాకిప్పించండి అని మరొకరు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కంటే గుండును మెయింటెన్ చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.