యశస్వినిరెడ్డి దెబ్బకి ఎర్రబెల్లి చిన్నమెదడు చితికిపోయింది... అది మామూలు ఓటమి కాదు: కడియం శ్రీహరి
- యశస్విని రెడ్డి దెబ్బకు ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా
- ఈ గెలుపు అస్సలు ఊహించనిది... ఆత్మహత్య చేసుకునే ఓటమి అని వ్యాఖ్య
- ఎర్రబెల్లిని దారుణంగా ఓడించి పాలకుర్తి పొలిమేరలకు రావొద్దని ప్రజలు ఓటేశారన్న కడియం
- మీకేం తెలుసు అన్నట్లుగా కేసీఆర్ మా అభిప్రాయాలను లైట్గా తీసుకునే వారని వ్యాఖ్య
సోమవారం ఆయన పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... అసలు ఊహించలేదని, ఎర్రబెల్లిది మామూలు ఓటమి కాదన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యశస్వినిరెడ్డి దాదాపు 50వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారన్నారు. ఓటమి ఎరుగని వ్యక్తి ఎర్రబెల్లిని దారుణంగా ఓడించి పాలకుర్తి పొలిమేరకు రావొద్దని ప్రజలు ఓటు వేశారన్నారు.
బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్న వారందరినీ ఓ కంపెనీలో పని చేసే కార్మికులుగా చూశారని కడియం ఆరోపించారు. పార్ట్నర్స్ అనే ఫీలింగ్స్ పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్షిప్ దక్కలేదని మండిపడ్డారు. ఓనర్ షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పని చేయడం కష్టంగా ఉంటుందన్నారు. మీకు ఏం తెలుసు అన్నట్లుగా కేసీఆర్ మా అభిప్రాయాలను చాలా లైట్గా తీసుకునేవారని ఆవేదన వ్యక్తం చేశారు.