81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్లో లీక్!
- భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద సమాచార గోప్యతా వైఫల్యం
- కొవిడ్ సంక్షోభం సందర్భంగా ఐసీఎమ్ఆర్ సేకరించిన భారతీయుల డేటా బహిర్గతం
- డార్క్ వెబ్లో డేటాను బయటపెట్టిన హ్యాకర్
- డేటా లీక్ను తొలిసారిగా గుర్తించిన అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ
- ఘటనపై దృష్టిసారించిన సీబీఐ
అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సంస్థ రిసెక్యూరిటీ ఈ హ్యాకింగ్ ఉదంతాన్ని తొలుత గుర్తించింది. హ్యాకర్ల చేతికి చిక్కిన సమాచారంలో భారతీయుల వివరాలు ఉన్న లక్ష పైళ్లు ఉన్నట్టు సంస్థ పరిశోధకులు గుర్తించారు. ప్రభుత్వ ఆధార్ వెబ్సైట్ సాయంతో ఈ సమాచారం నిజమైనదేనని కూడా పరిశోధకులు ధ్రువీకరించుకున్నారు. ఘటనపై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా కుడా ఐసీఎమ్ఆర్ను అప్రమత్తం చేసింది.
ఈ సమాచారం ఐసీఎమ్ఆర్తో పాటూ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద కూడా ఉండటంతో హ్యాకర్లు ఎక్కడి నుంచి ఈ డేటా తస్కరించారనేది తెలుసుకోవడం ఓ సవాలుగా మారింది.
మరోవైపు, ఈ ఏడాది ప్రథమార్థంలో హ్యకర్లు ఏకంగా ఎయిమ్స్ ఆసుపత్రినే టార్గెట్ చేసుకున్నారు. సర్వర్లను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఎయిమ్స్ నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎయిమ్స్ సిబ్బంది కొన్ని రోజుల పాటు రోగుల రికార్డుల నిర్వహణను మాన్యువల్గా చేపట్టాల్సి వచ్చింది.