ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేస్తా: రేణుకా చౌదరి ట్వీట్
- కోర్టులు ఎంత వేగంగా తీర్పిస్తాయో చూడాలన్న రేణుక
- 2018లో పార్లమెంట్ లో మోదీ తనను శూర్పణఖతో పోల్చారని వ్యాఖ్య
- అప్పటి వీడియోను ట్వీట్టర్లో షేర్ చేసిన రేణుక చౌదరి
రాహుల్ విషయంలో స్పందించినట్లే వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరిస్తాయో లేదో చూడాలని అన్నారు. 2018లో పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని, మోదీ తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని రేణుకా చౌదరి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. నిండు సభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు తనను బాధించాయని, మోదీపై పరువునష్టం దావా వేయబోతున్నానని రేణుక పేర్కొన్నారు.
కాగా, 2019లో కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలేననే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ నేత పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ న్యాయస్థానం రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీల్ కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. రాహుల్ కు బెయిల్ కూడా మంజూరు చేసింది.