ఈ నెల 7న ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త మంత్రుల ప్రమాణం ఎప్పుడంటే..!
- ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు తొలుత నిర్ణయం
- అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ వాయిదా
- సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు
- సీఎం జగన్ కు వేరే పర్యటన ఉండడం వల్లే
- ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణం!
వాస్తవానికి ఈ నెల 6న నరసరావుపేటలో జరిగే వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల 7న ఉదయానికి మార్చారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశ సమయాన్ని మార్చారని అంటున్నారు.
సమావేశం జరిగే ఆ రోజే.. పదవులు కోల్పోతున్న మంత్రుల పేర్లను సీఎం జగన్ ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆరోజే వారితో రాజీనామా చేయించి.. తెల్లారి అంటే ఈ నెల 8న గవర్నర్ వద్దకు వెళ్లి కొత్త వారిని నియమించేందుకు అనుమతి కోరనున్నట్టు సమాచారం. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే అదే రోజు కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత ఈ నెల 11న ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించబోతున్నారని చెబుతున్నారు. వెలగపూడిలోని సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.