విదేశాల్లోని పిచ్ లపై రవిశాస్త్రి గానీ, గవాస్కర్ గానీ విమర్శలు చేయడం ఎప్పుడూ చూడలేదు: అశ్విన్
- రెండో టెస్టులో టీమిండియా భారీ విజయం
- చెన్నై పిచ్ బాగాలేదంటూ విదేశీ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు
- తామెప్పుడూ విదేశాల్లో పరిస్థితులపై వ్యాఖ్యలు చేయలేదన్న అశ్విన్
- కొందరి మనస్తత్వాలు అంతేనని వెల్లడి
వ్యక్తుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, కానీ తాము విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని అన్నాడు. అంతేకాదు, భారత క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్ గానీ, రవిశాస్త్రి గానీ విదేశీ పర్యటనల్లో లొసుగులపై స్పందించిన దాఖలాలు లేనేలేవని, పిచ్ ల గురించి, పేస్ కు సహకరించేలా వాటిపై దట్టంగా మొలిపించిన గడ్డి గురించి వారు మాట్లాడడాన్ని ఎప్పుడూ చూడలేదని తెలిపాడు. తనకు తెలిసినంత వరకు ఇది మనస్తత్వాలకు సంబంధించిన విషయం అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
చెన్నైలో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 317 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అశ్విన్ మొత్తం 8 వికెట్లు తీయడమే కాదు, అద్భుతంగా ఆడి సెంచరీ నమోదు చేశాడు.
అయితే, ఇంగ్లండ్ ఈ పిచ్ పై తీవ్రంగా తడబాటుకు గురికావడంతో మాజీలు పిచ్ బాగాలేదని వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్ వా కూడా పిచ్ పై పెదవి విరిచాడు. ఇది టెస్టు క్రికెట్ కు సరిపోయే పిచ్ కాదని, ఆడలేనంత దారుణంగా ఉందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.