ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ నియామకం
- ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ
- ఒడిశా మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వభూషణ్
- ఛత్తీస్ గడ్ గవర్నర్ గా అనసూయ ఊకి నియామకం
గతంలో జనసంఘ్, జనతాపార్టీల్లో బిశ్వ భూషణ్ హరిచందన్ పని చేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1988లో జనతా పార్టీ లో చేరిన ఆయన 1996లో తిరిగి బీజేపీలో చేరారు. సుదీర్ఘకాలం ఒడిశాలో ప్రజాప్రతినిధిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఒడిశాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశారు. బీజేపీ-బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. హరిచందన్ కు సాహిత్యం అంటే ఇష్టం. ఒడియా భాషలో ఆయన పలు రచనలు చేశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేష జలక్, అస్తశిఖ, మానసి పుస్తకాలు రచించారు.
ఇదిలా ఉండగా, ఛత్తీస్ గడ్ గవర్నర్ గా అనసూయ ఊకిని నియమించారు. కాగా, ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.