అబ్బాయి ఎస్సీ, అమ్మాయి బీసీ.. పరువుహత్యా యత్నానికి కారణం ఇదే!
- మేనమామతో పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు
- ప్రేమించిన సందీప్ ను పెళ్లాడిన మాధవి
- పరువు పోయిందనే కోపంతో... ఇద్దరినీ హతమార్చేందుకు యత్నించిన తండ్రి
కూతురు తన పరువు తీసేసిందనే కోపంతో... ఓ పక్కా ప్రణాళిక ప్రకారం ఇద్దరినీ చంపేందుకు ప్లాన్ వేశాడు. ఇద్దరికీ కొత్త బట్టలు పెడతాను... రావాలంటూ ఇద్దరినీ నమ్మించి, పిలిపించాడు. ఆయన మనసులో ఉన్న దారుణ ఆలోచనను గుర్తించలేని కొత్త దంపతులిద్దరూ గోకుల్ థియేటర్ వద్దకు వచ్చి, స్కూటీపై ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.
ఈలోగా, వారి వాహనం పక్కనే బైక్ పార్క్ చేసి, తనతో పాటు తెచ్చిన బ్యాగును ఓపెన్ చేశాడు తండ్రి. బ్యాగులో నుంచి కొత్త బట్టలను తీస్తున్నాడనే వీరిద్దరూ అనుకున్నారు. కానీ, ఊహించని రీతిలో కొడవలిని బయటకు తీసి ఇద్దరిపై విచక్షణా రహితంగా దాడికి యత్నించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది.