ఎట్టకేలకు పవన్ను కలిసిన దిలీప్ సుంకర.. 41 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అధినేత సూచన!
- పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నానంటూ ఇటీవల దిలీప్ ఆవేదన
- పార్టీలోనే కాదు, పవన్ అభిమానిగా కూడా ఉండబోనంటూ పోస్ట్
- దిలీప్ ను కలిసి బుజ్జగించిన పవన్
వ్యవస్థతో పోరాడగలిగే శక్తి ఉన్నవాడివి స్థాయి తెలియని వ్యక్తులతో ఎంతకాలం పోరాడతావని పవన్ అన్నట్టు దిలీప్ సుంకర తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. సోషల్ మీడియా విమర్శలకు దూరంగా ఉండగలిగేలా నియంత్రించుకోవాలని సూచించారని వివరించారు. తనను కూడా ఎంతోమంది ఎన్నో అంటారని, వాటన్నింటికీ స్పందిస్తూ కూర్చుంటే గమ్యాన్ని చేరుకోలేమని పవన్ అన్నారని పేర్కొన్నారు.
ఇటీవల దిలీప్ సుంకర జనసేన పార్టీ నేతలపై ఫేస్బుక్ వేదికగా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. పార్టీలో తనను అవమానిస్తున్నారని, ఇక భరించడం తన వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని, పవన్ అభిమానిగా కూడా ఇక ఉండదలచుకోలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ ఆయనను కలిసి బుజ్జగించినట్టు సమాచారం.