అన్ని మతాలు ఒక్కటే.. కడప దర్గాకు వెళ్లా: సీఎం విజయ్ పాత ఇంటర్వ్యూ వైరల్
- తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్
- తన వ్యక్తిగత జ్యోతిషుడిని ఓఎస్డీగా నియమించడంతో తొలి వివాదం
- విమర్శల నేపథ్యంలో వైరల్ అవుతున్న విజయ్ పాత ఇంటర్వ్యూ
- అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి కలుగుతుందన్న విజయ్
- కడపలోని అమీన్పీర్ దర్గాను కూడా సందర్శించినట్లు గతంలో వెల్లడి
ఈ వివాదం నేపథ్యంలో విజయ్ గతంలో తన విశ్వాసాలు, దైవభక్తిపై మాట్లాడిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'బీస్ట్' సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్తో జరిపిన సంభాషణలో విజయ్ తన వ్యక్తిగత విశ్వాసాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి హిందువు, తండ్రి క్రిస్టియన్ అని, వారిది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులు తనపై ఏ విషయంలోనూ నిర్బంధం విధించలేదని, అదే స్వేచ్ఛను తాను తన పిల్లలకు ఇస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా తాను ప్రగాఢ విశ్వాసమున్న భక్తుడినని విజయ్ స్పష్టం చేశారు. "చర్చికి వెళ్లడం నాకు మంచి అనుభూతిని ఇస్తుంది. కేవలం చర్చిలకే కాదు, పిల్లార్పట్టి వినాయక ఆలయానికి, తిరునల్లార్ ఆలయానికి కూడా వెళ్లాను. అన్నిచోట్లా ఒకే రకమైన దివ్యమైన అనుభూతి కలుగుతుంది" అని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా 'కత్తి' (2014) సినిమా షూటింగ్ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఉన్న ప్రసిద్ధ అమీన్పీర్ దర్గాను కూడా సందర్శించానని విజయ్ గుర్తుచేసుకున్నారు. "చర్చి, ఆలయం, దర్గా.. ఏ ప్రార్థనా స్థలానికి వెళ్లినా నాకు ఒకే రకమైన దైవిక భావన కలుగుతుంది" అని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.