జయలలితకు చెప్పిన జోస్యం బెడిసికొట్టినా.. విజయ్ విషయంలో నిజమైంది!
- ఒకప్పుడు జయలలితకు జ్యోతిష్యం చెప్పిన రాధన్ పండిట్
- ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్కు ఓఎస్డీ (పొలిటికల్)గా నియామకం
- విజయ్ పార్టీ 'సునామీ' విజయం సాధిస్తుందని ముందే చెప్పిన పండిట్
- జయలలిత కేసులో ఆయన జోస్యం తప్పడంతో ఆమెకు దూరమయ్యారు
- ఈ నియామకంపై మిత్రపక్షం కాంగ్రెస్ నుంచి విమర్శలు
సుమారు 40 ఏళ్ల అనుభవం ఉన్న జ్యోతిష్యుడు, సంఖ్యా శాస్త్రవేత్త అయిన రాధన్ పండిట్, విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందే, ఎప్పుడు అడిగినా సరే విజయ్ ముఖ్యమంత్రి అవడం పక్కా అని బలంగా చెప్పేవారు. విజయ్ జాతకం "ఓ సునామీ వంటిది" అని అభివర్ణించిన ఆయన, 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) 150కి పైగా సీట్లతో ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆయన కీర్తి ప్రతిష్ఠలు పెరిగాయి. ఈ నేపథ్యంలో, టీవీకే అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న రాధన్ పండిట్ను ముఖ్యమంత్రి విజయ్కు ఓఎస్డీ (పొలిటికల్)గా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
డీఎంకే, ఏఐఏడీఎంకే శకం ముగిసిందని, ఎంజీఆర్ తరహాలో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలం ఆధిపత్యం చెలాయిస్తారని రాధన్ పండిట్ బలంగా వాదిస్తున్నారు. వచ్చే 40-50 ఏళ్ల పాటు టీవీకే హవానే కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే, సీఎం కార్యాలయంలో ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడంపై రాజకీయంగా చర్చ మొదలైంది. టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశికాంత్ సెంథిల్, "ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు?" అని సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో ఈ నియామకంపై వివాదం మరింత పెరిగింది. ఈ నియామకం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.