ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనిషి కల్పన కోసం పోలీసుల వేట
- విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
- పనిమనిషి కల్పనే ప్రధాన నిందితురాలని పోలీసుల నిర్ధారణ
- నిందితుల కోసం నేపాల్ సరిహద్దులో గాలింపు
- పక్కా పథకం ప్రకారమే దోపిడీ, హత్య జరిగిందని అనుమానం
దర్యాప్తు కోసం పదికి పైగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితురాలు, ఇంట్లో పనిమనిషిగా చేరిన కల్పన తన సహచరులతో కలిసి ఆటోలో నాంపల్లికి వెళ్లి, అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో నాగ్పుర్ వైపు పారిపోయినట్లు గుర్తించారు. అయితే, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు మార్గమధ్యంలోనే రైలు దిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కొన్ని టాస్క్ఫోర్స్ బృందాలు శుక్రవారం సాయంత్రానికే నేపాల్ సరిహద్దులకు చేరుకున్నట్లు సమాచారం.
ఈ దోపిడీ, హత్య వెనుక పక్కా ప్రణాళిక ఉందని పోలీసులు నిర్ధారించారు. పనిలో చేరడం దగ్గర నుంచి దోపిడీ వరకు బయటి వ్యక్తుల ఆదేశాలతోనే కల్పన నడుచుకుందని భావిస్తున్నారు. ఆమెకు సన్నిహితంగా ఉన్న పలువురు నేపాలీ మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు ముగ్గురా, నలుగురా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో లభించిన సెల్ఫోన్ల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.