ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు
- ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం
- 104 మొబైల్ వాహనాల ద్వారా గ్రామస్థాయిలో వైద్య సేవలు
- ఏటా 57 లక్షల మందికి లబ్ధి.. రూ.163 కోట్ల బడ్జెట్
- వ్యాధుల నివారణ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారే లక్ష్యం
- రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 మొబైల్ మెడికల్ యూనిట్ల (104 వాహనాలు) ద్వారా గ్రామస్థాయిలో అమలు చేయనున్నారు. ఇందుకోసం ఏటా రూ.163 కోట్లు ఖర్చు చేయనుండగా, సుమారు 57 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రతి మొబైల్ యూనిట్ రోజుకు 20 మందికి చొప్పున పరీక్షలు నిర్వహిస్తుంది.
ప్రస్తుతం 104 వాహనాల్లో కేవలం 6 రకాల సాధారణ పరీక్షలను మాత్రమే రాపిడ్ కిట్ల ద్వారా చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ వాహనాల్లో సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ, సీబీసీ ఎనలైజర్ల వంటి అధునాతన పరికరాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ సహా 11 కేటగిరీలలో 47 రకాల కీలక పరీక్షలు అందుబాటులోకి వస్తాయి.
ఈ పరీక్షల ద్వారా ప్రతి వ్యక్తికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (EHR), వ్యాధుల ప్రొఫైల్ తయారుచేస్తారు. ఈ డేటాను 'సంజీవని' పథకం కింద భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. రానున్న రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.