నిర్మాతగా మారిన నిత్యా మీనన్
- 'కీయురి ప్రొడక్షన్స్' పేరుతో సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం
- సినిమా అంటే కథలు చెప్పడమే కాదని వివరణ
- 'అలా మొదలైంది' నాటి రోజులను గుర్తుచేసుకున్న నిత్యా మీనన్
సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదని, మనుషులను లోతైన స్థాయిలో స్పృశించడం అని ఆమె పేర్కొన్నారు. "నటన ప్రారంభించిన తొలిరోజు నుంచి నా ఉద్దేశం ఇదే. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే ఉద్దేశంతో కొనసాగుతాను. నాలోని సృజనాత్మక ప్రక్రియ ద్వారా, చూసేవారిలో ఒక పరివర్తన తీసుకురావడమే నా లక్ష్యం" అని తన పోస్టులో వివరించారు. భూమి గుహల నుంచి పుట్టి, రాతితో చెక్కబడిన, కాంతిని ప్రేమించే రూపం లేనిదే 'కీయురి' అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన తొలి తెలుగు చిత్రం 'అలా మొదలైంది' 15 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటి జ్ఞాపకాలను కూడా నిత్యా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము తీస్తున్న రొమాంటిక్ కామెడీని ఎవరూ అర్థం చేసుకోలేదని, షూటింగ్ తర్వాత ఇరానీ చాయ్ తాగుతూ సమయం గడిపేవాళ్లమని తెలిపారు.
షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి తనతో, "ఇకపై నువ్వు ఇలా స్వేచ్ఛగా రెస్టారెంట్లోకి వెళ్లలేవు" అన్నారని, ఆ మాటలు తనకు అప్పట్లో వింతగా అనిపించాయని చెప్పారు. చిన్న సినిమాలు చేసుకుంటూ స్వేచ్ఛగా ఉండాలనుకున్న తన జీవితాన్ని 'అలా మొదలైంది' పూర్తిగా మార్చేసిందని, ఇప్పుడు నిర్మాతగా అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నానని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.