ఆకలవుతోందని ఏడుస్తున్న చిన్నారిని గొంతుపిసికి చంపిన తండ్రి
- పంజాబ్ లోని జలంధర్ లో ఘోరం
- డ్రగ్స్ మత్తులో కన్నకూతురినే చంపిన కసాయి
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
చండీగఢ్ కు చెందిన అర్విందర్ సింగ్ భార్యాబిడ్డలతో కలిసి జలంధర్ లోని దూరదర్శన్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. అర్విందర్ రోజు కూలీగా పనిచేస్తుండగా.. ఆయన భార్య పనిమనిషిగా చేస్తోంది. కొంతకాలంగా అర్విందర్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. తరచూ డ్రగ్స్ తీసుకుంటూ, మద్యం సేవిస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న భార్య పనికి వెళ్లగా కూతురు నిహారిక (5)తో పాటు అర్విందర్ ఇంట్లో ఉన్నాడు.
మధ్యాహ్నం అర్విందర్ మద్యం సేవిస్తుండగా నిహారిక ఆకలవుతోందని ఏడవడం మొదలుపెట్టింది. తొలుత నిహారికను గద్దించిన అర్విందర్.. పాప ఏడుపు ఆపకపోయేసరికి నేలపైకి విసిరేశాడు. దీంతో దెబ్బలు తగిలి నిహారిక ఏడుపు మరింత పెరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అర్విందర్.. నిహారికను గొంతు పిసికి చంపేశాడు. పనిముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి ఈ ఘోరం చూసి కన్నీటిపర్యంతమైంది. నిహారిక మామ ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.