లోక్సభలో తీవ్ర ఉద్రిక్తత... 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
- బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వేటు వేసిన ఇన్చార్జి స్పీకర్
- ఛైర్ వైపు కాగితాలు విసిరి, సభకు అంతరాయం కలిగించారని ఆగ్రహం
- చైనా సరిహద్దు వివాదంపై చర్చకు పట్టుబట్టిన రాహుల్ గాంధీ
- మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తక ప్రస్తావనపై సభలో వాగ్వాదం
"ప్రతిపక్షాలకు తమ గళం వినిపించే హక్కు ఉంది, కానీ నిరసన పేరుతో సభను పూర్తిగా స్తంభింపజేయడం, ప్రొసీడింగ్స్ జరగకుండా అడ్డుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధం" అని దిలీప్ సైకియా వ్యాఖ్యానించారు.
అంతకుముందు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణల అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకానికి సంబంధించిన ఓ మ్యాగజైన్ కథనాన్ని రాహుల్ ప్రస్తావించారు. అయితే, ధృవీకరించని వార్తా కథనాలను సభలో చదవకూడదని ప్యానెల్ స్పీకర్ సైకియా అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ.. "మాట్లాడటానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను ప్రతిపక్ష నాయకుడిని.. నాకు పర్మిషన్ అనే పదం వాడటం సరికాదు" అని మండిపడ్డారు.
తూర్పు లడఖ్లో ఘర్షణల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, దీనిపై ప్రధాని స్పందన ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. ఈ సమయంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే సస్పెన్షన్ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. టీడీపీ ఎంపీ జి.ఎం. హరీశ్ బాలయోగి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, సభలో నిరసనల హోరు తగ్గకపోవడంతో ప్రసంగం కొనసాగలేదు.