బారామతిలో నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరవుతున్న ప్రధాని మోదీ, అమిత్ షా!
- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- నిన్న ఉదయం బారామతి ఎయిర్పోర్ట్ రన్వే సమీపంలో కూలిన చార్టర్డ్ విమానం
- అజిత్ పవార్తో పాటు మరో నలుగురి మృతి
బుధవారం ఉదయం బారామతి ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టేబుల్టాప్ రన్వేకు కేవలం 200 మీటర్ల దూరంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ దివంగత నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అత్యున్నత స్థాయి నేతలు వస్తుండటంతో బారామతిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంతాప దినాలను ప్రకటించింది. రన్వే సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను వెలికితీసేందుకు నిపుణుల కమిటీ దర్యాప్తును వేగవంతం చేసింది.