'వెనెజువెలాను ఇప్పుడు నేనే నడిపిస్తున్నా': ఎన్బీసీ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- వెనెజువెలాతో తాము యుద్ధం చేయడం లేదన్న ట్రంప్
- డ్రగ్ మాఫియాపైనే తమ పోరాటమని స్పష్టీకరణ
- ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్న అధ్యక్షుడు
- వెనెజువెలా చమురు రంగాన్ని పునర్నిర్మించే బాధ్యత అమెరికా కంపెనీలదేని వెల్లడి
వచ్చే 30 రోజుల్లో వెనెజువెలాలో ఎన్నికలు జరుగుతాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ ప్రతికూలంగా స్పందించారు. "ముందు దేశాన్ని ఒక దారికి తీసుకురావాలి. ప్రజలు ఓటు వేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దేశ ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకునేలా చూడడమే మా మొదటి ప్రాధాన్యం" అని ఆయన పేర్కొన్నారు.
వెనెజువెలా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు రంగాన్ని పునర్నిర్మించేందుకు అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఈ ప్రక్రియకు 18 నెలల కంటే తక్కువ సమయం పడుతుందని ఆయన అంచనా వేశారు. "దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చును చమురు కంపెనీలే భరిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఆదాయం ద్వారా లేదా మా ద్వారా వారు ఆ సొమ్మును తిరిగి పొందుతారు" అని వివరించారు.
తాము వెనెజువెలాతో యుద్ధం చేస్తున్నామన్న వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. "మేము యుద్ధం చేస్తోంది వెనెజువెలాతో కాదు.. మా దేశంలోకి డ్రగ్స్ పంపుతున్న మాఫియాతో. తమ జైళ్లలోని ఖైదీలను, నేరస్తులను మా దేశంలోకి వదిలిపెట్టిన వారిపైనే మా పోరాటం" అని ఆయన స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఒకవేళ సహకారం అందకపోతే రెండోసారి సైనిక దాడి చేసేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదన్న విమర్శలపై స్పందిస్తూ.. తమ చర్యలకు చట్టసభల మద్దతు ఉందని, అనవసరంగా సమాచారం లీక్ కాకూడదనే గోప్యంగా ఉంచామని ట్రంప్ సమర్థించుకున్నారు.