భక్తుల తాకిడితో మినీ జాతరను తలపించిన మేడారం
- మేడారం మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వనదేవతల దర్శనానికి పోటెత్తున్న భక్తులు
- జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
- మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ల రాకతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్
కుటుంబ సభ్యులతో తరలివచ్చిన భక్తులు తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అక్కడే జంపన్న, నాగులమ్మలకు ముడుపులు చెల్లించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్నవాగు పరిసరాలు, గద్దెల ప్రాంతం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడాయి. మేడారంకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
ఇదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు అధికారులు దేవతల దర్శనంతో పాటు ఏర్పాట్ల పర్యవేక్షణకు రావడంతో వారి కాన్వాయ్ల కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.