లండన్ కేఎఫ్సీలో భారతీయుడిపై వివక్ష.. మేనేజర్కు రూ. 81 లక్షల జరిమానా!
- తమిళనాడుకు చెందిన మధేష్ను ‘బానిస’ అంటూ దూషించిన మేనేజర్
- సెలవు నిరాకరించడంతో పాటు అకారణంగా ఉద్యోగం నుంచి తొలగింపు
- ఇది జాతి వివక్షేనని తేల్చిన లండన్ కోర్టు, బాధితుడికి భారీ పరిహారం ప్రకటన
- బాధితుడికి రూ. 81 లక్షలు చెల్లించాలని ఆదేశం
మధేష్ 2023లో వెస్ట్ వికమ్ కేఎఫ్సీలో ఉద్యోగంలో చేరగా, అక్కడ మేనేజర్గా ఉన్న కాజన్ అనే వ్యక్తి అతడి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించేవాడు. భారతీయులందరూ 'మోసగాళ్లు' అని, మధేష్ ఒక 'బానిస' అంటూ అసభ్య పదజాలంతో దూషించేవాడు. అంతేకాకుండా, మధేష్ సెలవు కోరితే తిరస్కరించి, కేవలం శ్రీలంక తమిళులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవాడని కోర్టు విచారణలో తేలింది.
పనివేళల విషయంలో వేధింపులు మితిమీరడంతో మధేష్ రాజీనామా చేయగా, నోటీసు పీరియడ్లో ఉండగానే మేనేజర్ అతడిని దూషిస్తూ ఉద్యోగం నుంచి తొలగించాడు. దీనిపై మధేష్ ఉపాధి ట్రైబ్యునల్ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన జడ్జి పాల్ అబోట్.. నెగ్జస్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ జాతి వివక్షకు పాల్పడిందని స్పష్టం చేశారు. మధేష్ గౌరవానికి భంగం కలిగించినందుకు, చట్టవిరుద్ధంగా తొలగించినందుకు గానూ భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.