టీటీడీ మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజు కన్నుమూత.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం
- టీడీపీ సీనియర్ నాయకుడు రామచంద్రరాజు కన్నుమూత
- ఎన్టీఆర్ రాజుగా సుపరిచితులైన ఆయన తిరుపతిలో తుదిశ్వాస
- టీటీడీ బోర్డు సభ్యుడిగా పలుమార్లు సేవలందించిన ఎన్టీఆర్ రాజు
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం
- ఆయన మృతి పట్ల నందమూరి కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి
ఎన్టీఆర్ రాజు మృతి పట్ల నందమూరి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందమూరి రామకృష్ణ స్పందిస్తూ.. “మన అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని, వరుసగా రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులైన రామచంద్రరాజు గారు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని మా కుటుంబం తరఫున భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
నందమూరి బాలకృష్ణ కూడా తన సంతాపం ప్రకటించారు. “తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా అన్నగారు నియమించిన పెద్దలు రామచంద్రరాజు గారు ఇవాళ కన్నుమూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజు మరణ వార్త తెలియగానే పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.