నన్ను ఇరికించిన వారిని వదలను: కోర్టు వద్ద చెవిరెడ్డి వ్యాఖ్యల కలకలం
- లిక్కర్ స్కామ్లో తనను అన్యాయంగా ఇరికించారని చెవిరెడ్డి ఆవేదన
- దేవుడు అంతా చూసుకుంటాడని వ్యాఖ్య
- తనకు మద్యం తీసుకునే అలవాటు కూడా లేదన్న చెవిరెడ్డి
విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో చెవిరెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. "నాకు మద్యం తాగే అలవాటు లేదు, నేను ఎప్పుడూ అమ్మలేదు. ఈ కేసులో నా తప్పేమీ లేదు. అయినా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు" అంటూ ఆరోపించారు. తనను ఈ కేసులో ఇరికించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు. "పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఆయనే అంతా చూసుకుంటాడు" అని వ్యాఖ్యానిస్తూ పోలీసు జీపు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సిట్ అధికారులు చెవిరెడ్డితో పాటు మొత్తం 10 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, గోవిందప్ప మినహా మిగతావారిని కోర్టుకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం నిందితులందరినీ తిరిగి జైళ్లకు తరలించారు.