మూసీ ప్రక్షాళన ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది: రేవంత్ రెడ్డి
- ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన
- నగర ప్రజల దాహార్తి తీర్చడానికే ఈ పథకం తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి
- సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకు వెళతామని వ్యాఖ్య
వరద నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారని ఆయన గుర్తుచేశారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం పీజేఆర్ ఎన్నో పోరాటాలు చేశారని ఆయన స్మరించుకున్నారు. రూ. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సమస్యలు ఎదురైనా సమన్వయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ పథకాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలుస్తానని తెలిపారు.