ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం.. డీకే శివకుమార్ దూరం!
- అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడి
- నిధుల కేటాయింపుకు సంబంధించి విధానసౌధలో సమావేశం కానున్న ఎమ్మెల్యేలు
- డీకే శివకుమార్ దూరంగా ఉండటంపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన
కీలక సమావేశానికి డీకే శివకుమార్ దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెబుతుండగా, ఇదేం కొత్త కాదని అధికార వర్గాలు తెలిపాయి. గతంలోను తన పదవీ కాలంలో పలు సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారని చెబుతున్నారు. డీకే శివకుమార్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన సమావేశానికి హాజరుకాలేకపోతున్నారని మరికొందరు అంటున్నారు.
సాధారణంగా ఇలాంటి సమావేశాలు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల్లో జరుగుతాయి. ఈసారి విధానసౌధలో ముఖ్యమంత్రి ఛాంబర్లో నిర్వహిస్తున్నారు. డీకే శివకుమార్ను దూరం పెట్టడానికే విధానసౌధలో ఈ సమావేశం జరుగుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.