Sangaredi Youth: కూల్ డ్రింకులో బల్లి... పాపం, సగం తాగేశాడు!

వేసవిలో చాలామంది కూల్ డ్రింకులు తాగేందుకు ఇష్టపడుతుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు మండే ఎండల్లో చల్లచల్లగా తియ్యతియ్యగా కూల్ డ్రింకులను ఆస్వాదిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కూల్ డ్రింకు సీసాల్లో వివిధ రకాల జీవుల అవశేషాలు కనిపిస్తుండడం తెలిసిందే.
తాజాగా ఓ యువకుడు సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద జాతీయ రహదారికి పక్కనే ఉన్న రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ తాగాడు. పాపం, సగం తాగిన తర్వాత ఆ సీసాలో బల్లి అవశేషాలు ఉన్నట్టు గుర్తించాడు. స్వల్ప అస్వస్థతకు గురైన అతడిని స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనిపై రెస్టారెంట్ యజమానిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని యువకుడి స్నేహితులు మండిపడుతున్నారు. ఇటువంటి వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.