Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విష్ణుప్రియ

- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు
- అడ్వొకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యాంకర్
- మంగళవారమే రావాలని నోటీసులు ఇచ్చినా షూటింగ్ కారణంగా గైర్హాజరు
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా.. షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరయ్యారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఎంతోమంది అప్పుల ఊబిలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ యాప్స్ కు సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా 11 మంది ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు.. విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.