Nara Lokesh: ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదల ముఖంలో చిరునవ్వు: యుఫోరియా మ్యూజికల్ నైట్ లో నారా లోకేశ్

- ఎన్టీఆర్ ట్రస్ట్ సారథ్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్
- తలసేమియా బాధితుల కోసం నిధుల సేకరణ
- విజయవాడలో సంగీత విభావరి
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నమ్మకం. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి ఆలోచన, భువనేశ్వరి గారి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్ట్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28వవార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధితుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "తలసీమియా బాధితులకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. 1997లో ఒక్క అడుగుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రయాణం ప్రారంభమైంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది ఎన్టీఆర్ ట్రస్ట్. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత త్రాగునీరు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజల మనస్సు గెలుచుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజల్ని అందరి కంటే ముందు పలకరించేది, సాయం అందించేది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తీ తో మహిళలు సొంత కాళ్ళ పై నిలబడే శక్తిని ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్" అని వివరించారు.
ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు అండగా...
ఫ్యాక్షన్ హింసకు గురైన అనేక కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశాజ్యోతిగా నిలిచింది, వారికి విద్య, ఆర్థిక మద్దతును అందిస్తోంది. నా పాదయాత్రలో, ట్రస్ట్ చాలా మంది చిన్న పిల్లల జీవితాలను ట్రస్ట్ ఎలా మార్చేసిందో నేను ప్రత్యక్షంగా చూశాను.
అనంతపురానికి చెందిన శ్రావణి అనే యువతి నన్ను కలిసింది. వీరి తండ్రి తగరకుంట ప్రభాకర్ ఫ్యాక్షన్ హింసలో మృతి చెందారు. శ్రావణి, ఆమె ఐదుగురు తోబుట్టువులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ నుండి విద్యను అభ్యసించారు, వారిలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. చిన్నవారైన శ్రావణి ఇప్పుడు బెంగుళూరులో పని చేస్తోంది, ఇది ట్రస్ట్ యొక్క సానుకూల ప్రభావానికి నిదర్శనం.
మౌనిక అనే యువతి నన్ను అనంతపురంలో కలిసింది. ఫ్యాక్షన్ హింసలో ఆమె తండ్రి శ్రీనివాస్ గౌడ్ చనిపోయారు. మౌనిక, ఆమె సోదరి, నాగమణి, ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్నారు, నాగమణి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారింది. మౌనిక వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసింది. అధికారంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయం.
వరదబాధితులకు ఆపన్నహస్తం
ఉత్తరాఖండ్ వరదలు, హుద్ హుద్ తుఫాన్, తిత్లీ, గత ఏడాది విజయవాడ వరదలు, కర్నూలు వరదలు, గోదావరి వరదల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితులకు అండగా నిలచింది. అన్నమయ్య డ్యామ్ కొట్టుకపోయిన సమయంలో 48 బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆపన్నులకు అండగా నిలుస్తూ సహాయక చర్యల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుంది. అవసరమైన వారికి సకాలంలో సమర్థవంతమైన సేవలను అందిస్తోంది.
ఆరోగ్యసేవల్లో మేటి ఎన్టీఆర్ ట్రస్ట్
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించింది. క్లిష్టమైన సమయంలో అవసరమైన వారికి అండగా నిలచింది. మాస్క్లు, మందులు, ఆక్సిజన్ను పంపిణీ చేశాం.
మా ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల కోసం కూడా మేము సాయం అందించాం. ఇప్పటివరకు 8.70 లక్షల మంది రోగులకు రక్తాన్ని అందించడం ద్వారా ట్రస్ట్ లక్షలాది బాధితల ప్రాణాలను కాపాడింది. తలసేమియా, జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న 200 మంది పిల్లలు ట్రస్ట్ నుండి రక్తాన్ని పొందుతున్నారు. 2,020 మంది అనాథలు పూర్తిగా ఉచిత వసతి, విద్యను ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోంది.
నిరంతరం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరిగారు, ట్రస్ట్ టీమ్, సంగీత దర్శకుడు తమన్, హాజరైన వారందరికీ మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.