Sanjay Dutt: సంజయ్ దత్ కు రూ. 72 కోట్ల ఆస్తి రాసిచ్చి చనిపోయిన మహిళా వీరాభిమాని

Late female fan left her entire wealth to Sanjay Dutt

  • ఇటీవలే చనిపోయిన నిషా పాటిల్ (62)
  • 2018లోనే సంజయ్ దత్ పేరిట వీలునామా రాయించిన వైనం
  • ఆస్తిని స్వీకరించని సంజయ్ దత్
  • అభిమాని ప్రేమకు చలించిపోయిన నటుడు

సినీ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అభిమాన హీరోల కోసం కొట్టుకోవడం కూడా చూస్తుంటాం. తమ హీరోల సినిమాలు విడుదలైతే ఫ్లెక్సీలు కట్టడం, పాలాభిషేకాలు చేయడం కూడా సాధారణ విషయమే కానీ, తాను అభిమానించే హీరోకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసివ్వడం ఎప్పుడైనా విన్నామా...? కానీ, ఇది జరిగింది. విషయం తెలిసిన ఆ హీరో చలించిపోయారు.

వివరాల్లోకి వెళితే... ముంబైకి చెందిన నిషా పాటిల్ కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను అభిమానిస్తోంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు కాగా... ఆమె పేరిట దాదాపు రూ. 72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.

తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయనే విషయాన్ని గ్రహించిన నిషా పాటిల్... 2018లోనే తన ఆస్తి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బు సంజయ్ దత్ కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్ ఇంటికి వచ్చాయి. విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్ కు గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చలించిపోయారు. 

అయితే ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్ కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు.

  • Loading...

More Telugu News